(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు ఢిల్లీలోని తిస్ హజరీ కోర్టు జీవిత ఖైదు శిక్షతో పాటు 25లక్షల రూపాయల పరిహారం చెల్లించాలంటూ శుక్రవారం తీర్పు వెలువరించింది. సింగార్ను సోమవారం న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే.
వివరాల్లోకి వెళితే కుల్దీప్ సింగ్ 2017 జూన్ నాల్గవ తేదీన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి తల్లిదండ్రులు బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, అతనికి సహకరించిన శశి సింగ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ గృహం వద్ద భైటాయించి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసనకు దిగారు. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆ నేపథ్యంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, అతనికి సహకరించిన శశిసింగ్పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా అత్యాచార బాధితురాలి తండ్రిపై అక్రమాయుధాలు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉండగానే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గత జులైలో బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి పిన తల్లి, అత్త ఇద్దరు మరణించగా ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను విమానంలో ఢిల్లీకి తరలించి ఉన్నత వైద్య సేవలు అందించగా మృత్యువుతో పోరాడి కొద్ది రోజులకు కోలుకున్నది.
బాధితురాలిపై హత్యాయత్నం చేయించిందీ సెంగార్యేనని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన్ను పార్టీ నుండి బిజెపి బహిష్కరించింది. బాధితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమె కుటుంబానికి సిఆర్పిఎఫ్ బలగాలతో రక్షణ కల్పించింది. కేసుల పరిస్థితిని సమీక్షించిన సుప్రీంకోర్టు.. లక్నో బెంచ్ నుంచి ఢిల్లీ కోర్టుకు కేసును బదిలీ చేసింది.
న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ ధర్మాసనం ఆగస్టు అయిదవ తేదీ నుండి రోజూ వారి విచారణ నిర్వహించి అత్యాచారం కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్యే దోషిగా సోమవారం నిర్ధారించారు. శుక్రవారం శిక్షను ఖరారు చేశారు. జీవిత ఖైదు శిక్షణతో పాటు 25లక్షలు బాధితురాలికి పరిహారంగా అందజేయాలని తీర్పు ఇచ్చింది కోర్టు.