అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది.
ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్, ప్రతిపక్షాలు చంద్రబాబును ప్రశ్నించాయి. సమీక్షలకు అధికారులు వెళ్ళొద్దని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబు హోంశాఖ సమీక్షను రద్దు చేసుకున్నారు. ఇంతటితో కథ సమాప్తం అయ్యిందని భావించారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. పోలవరం, సిఆర్డిఏ సమీక్షల మీద మొదలైన రచ్చ కొనసాగుతూనే ఉంది. వైసిపి నేతలు నేటికీ సమీక్షలపై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. ఇటు టిడిపి కూడా వైసిపిపై విమర్శలు చేస్తూనే ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
చంద్రబాబు కూడా ఎన్నికల కమిషన్ విధానాలపై రాజీలేని పోరాటం చేస్తానని ఖరాఖండిగా చెప్పేశారు. ‘ఆంక్షలు అందరికీ వర్తింపజేస్తే సరి. నా మీద మాత్రమే ఆంక్షలు పెడితే నేను పోరాడతాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ ముఖ్యనేతలు కూడా ఎన్నికల కమిషన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల నియమావళి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అమలులో ఉందా అని చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డిజిపి కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం?’ అని లోకేష్ నిలదీశారు.
ఎన్నికల కమిషన్ ఆంక్షలన్నీ టిడిపికే వర్తిస్తాయా అని లోకేష్ విమర్శించారు. ‘ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?’ వైసిపిని ఉద్దేశించి లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
72 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికల కమిషన్ ను చూడలేదని మరో మంత్రి సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలపై వైసిపి అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. మోది, రాజ్ నాథ్ సింగ్, కేసిఆర్ లకు ఎన్నికల నియమావళి వర్తించవా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పరిపాలించాలని జగన్, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. చరిత్రలో 13 మంది చూశాం గానీ మోది లాంటి వారిని మాత్రం చూడలేదన్నారు. ఆయన ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని సోమిరెడ్డి దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రివ్యూలను ప్రతిపక్షం తప్పుపట్టడం దారుణమని ఎంపి కనకమేడల వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని కనకమేడల ధ్వజమెత్తారు. ప్రధాని, రాజ్నాథ్ రివ్యూలకు అడ్డంరాని నియమావళి చంద్రబాబుకే వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వానికి ఐదేళ్లు పాలన చేసే అధికారం ఉంటుందని కనకమేడల తెలిపారు. నియమావళి అమలులో ఉంటే ఫలితాలు వచ్చేవరకు ప్రభుత్వం నిద్రపోవాలా? అని కనకమేడల నిలదీశారు. సంక్షేమ పథకాలను సకాలంలో అందిచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తన జీవితంలో ఇంత పనికిమాలిన ఎన్నికల కమిషన్ ను ఎప్పుడూ చూడలేదని పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమీక్షలు చేస్తుంటే పట్టించుకోని ఎన్నికల కమిషన్ చంద్రబాబు సమీక్షలను మాత్రమే ఎందుకు పట్టించుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. టిడిపి తరపున 157 ఫిర్యాదులు చేస్తే ఒక్కదాన్ని కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని వర్ల రామయ్య మండిపడ్డారు.
ఇందంతా చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో సర్దుమణిగే సూచనలు కనపడట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టిడిపి ప్రశ్నించేది ఒక్కటే ఒక్క ఆంధ్రప్రదేశ్ పైనే ఎందుకు ఇలా జరుగుతోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికల నియమావళి అమల్లోనే ఉంది అనేదాన్ని ఎన్నికల కమిషన్ కు గుర్తుచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది అని వాదిస్తోంది.