అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు.
ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం చంద్రబాబు వివిధ అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ముగిశాయని పాలనపై దృష్టి పెట్టకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషిచేయాలని నేతలకు సూచించారు. తాగునీరు వంటి సమస్యల పరిష్కారాన్ని సాధారణ పరిస్థితుల్లో మాదిరిగానే పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు.
శాంతి భద్రతల విషయంలో ఎవరైనా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల విధులు లేని అధికారులు రాష్ట్రాభివృద్ధి కోణంలో దృష్టిపెట్టి బాధ్యతలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రమంతా ఒకే కుటుంబం అనే భావన బలపడాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభావవంతంగా పనిచేసేలా రైతులతో చర్చించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలన్నారు. పంటలు అమ్ముకునే సమయానికి సరైన వ్యవస్థ లేకుంటే రైతులు నిరాశ చెందుతరాని చంద్రబాబు చెప్పారు.
ఈ అంశాలతోపాటు ఎన్నికల అనంతర పరిణామాలపై కూడా చంద్రబాబు సమీక్ష జరిపారు. ఎన్నికల సంఘం తీరు, ఈవిఎంలు, ప్రతిపక్షపార్టీ నేతల వ్యాఖ్యలు, ఓటింగ్ సరళి తదితర అంశాలపై నేతలతో చర్చించారు.
శ్రీలంక జరిగిన బాంబు పేలుళ్లపై కూడా చంద్రబాబు స్పందించారు. ఈ దాడులను మానవతా వాదులంతా ఖండించాలన్నారు. దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.