న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి గెలుపు, మరొకరి ఓటమిగా చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, దశాబ్దాలు సాగిన న్యాయప్రక్రియ ఇన్నాళ్లకు ముగిసిందన్నారు. సుప్రీం తీర్పును దేశమంతా స్వాగతించిందని చెప్పారు. సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిందని, అందరినీ ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల వాదనలను, అభిప్రాయాలను, సూచనలను సుప్రీం కోర్టు ఎంతో సహనంతో, తెగువతో ఆలకించిందని కొనియాడారు. దేశ న్యాయచరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం మొదలైందని, న్యాయమూర్తులు, న్యాయాలయాలకు శుభాభినందనలు తెలిపారు.ఓ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించిందని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించిందని చెప్పారు. రామభక్తి, రహీం భక్తి కాదు.. భారత భక్తిభావాన్ని బలోపేతం చేయాల్సిన సమయమిదని చెప్పారు. దేశ ప్రజలందరూ శాంతి, సద్భావన, ఐకమత్యంతో నిలవాలని విజ్ఞప్తి చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం నేడు సంపూర్ణత్వంతో వికసించిందని మోదీ పేర్కొన్నారు. భారతదేశపు ఈ మూల మంత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారన్నారు.
నవంబరు 9 భారత చరిత్రలో నిలిచిపోయే రోజుగా మోదీ అభివర్ణించారు. నవంబర్ 9న బెర్లిన్ గోడను కూల్చేసి తూర్పు, పశ్చిమ బెర్లిన్ ప్రజలు ఒక్కటయ్యారన్నారు. ఇదే రోజు భారత్ – పాకిస్తాన్ మధ్య కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాకిస్థాన్ తో సయోధ్యలో భాగంగా కర్తార్పూర్ కారిడార్ ప్రారంభమైందని, ఇదే సమయంలో అయోధ్య అంశంలో చారిత్రాత్మక తీర్పు వచ్చిందని మోదీ పేర్కొన్నారు.
‘నవంబర్ 9నే బెర్లిన్ గోడ కూలింది. ఈ 9 నవంబర్ దేశ ప్రజలందరినీ కలిసికట్టుగా నడవమని సందేశమిస్తోంది. రెండు వైరుధ్యాలు కలగలసిన తరుణమిది. ఐకమత్యంగా కలిసి ఉండే తరుణమిది. నవభారతంలో భయం, విభేదాలకు ఎలాంటి స్థానం లేదు. కఠినమైన సమస్యలనూ రాజ్యాంగ పరిధిలో పరిష్కరించవచ్చు. ఆలస్యమైనా సరే ధైర్యంగా ఉండటం సబబు. న్యాయవ్యవస్థపై నమ్మకం చెక్కు చెదరకుండా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు కొత్త ఉదయాన్ని తీసుకువచ్చింది. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం, నవభారతాన్ని నిర్మిద్దాం. అందరినీ కలుపుకుంటూ అందరి అభివృద్ధి కాంక్షిస్తూ మనం ముందుకు సాగుదాం’ అని మోదీ పేర్కొన్నారు.