విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే విమర్శలు చేస్తున్న నేతల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని జగన్ ప్రశ్నించారు.
విజయవాడలో సోమవారం జరిగిన దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి వేడుకలో జగన్ ఆంగ్ల మాధ్యమంపై వస్తున్న విమర్శలపై స్పందించారు.
పిల్లలకు ఉన్నత చదువులు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రభుత్వ కీలక నిర్ణయాన్ని విమర్శిస్తూ మాట్లాడటం నిజంగా దారుణమని అన్నారు. వారి పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు కావాలి, పేదలకు ఇంగ్లీషు మీడియం అవసరం లేదా అని జగన్ ప్రశ్నించారు. పిల్లలకు మంచి చదువులు ఇవ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేల పాఠశాలలను అధునీకరించి ఇంగ్లీషు మీడియంను అమలు చేస్తామని జగన్ చెప్పారు. ఇంగ్లీషు మీడియంను అమలు చేస్తూనే తెలుగును ఒక సబ్జెక్ట్గా గుర్తిస్తామని ఆయన తెలిపారు.