(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన వైసిపికి ఐప్యాక్ ఎన్నికల వ్యూహాలు అందించింది. అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఐప్యాక్ సేవలను వినియోగించుకోనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆప్ ఆ వరసలో చేరింది.
Happy to share that @indianpac is coming on-board with us. Welcome aboard!
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2019
2021లో పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవల బిజెపి బలం పెరిగిన కారణంగా రానున్న ఎన్నికలు మమతకు సవాలేనని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో మమత తోబుట్టువు కుమారుడు అభిషేక్ బెనర్జీ ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలని అమెకు సిఫారసు చేశారు. ఢిల్లీ శాసనసభకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో గడువు ముగుస్తుంది.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బిజెపితో కలిసి బీహార్లో ప్రభుత్వం నడుపుతున్న జనతాదళ్ యునైటెడ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మొన్న పౌరసత్వం సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి నితిష్ కుమార్తో ప్రశాంత్ కిషోర్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, ఇక ఇండియా ఆత్మను రక్షించే బాధ్యత 16 మంది బిజెపియేతర ముఖ్యమంత్రులపై ఉంది అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.