హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో దిశ నోట్లో నిందితులు బలవంతంగా మద్యం పోసినట్లు ఈ రిపోర్టుతో రుజువైంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… అత్యాచారం సమయంలో నిందితులు ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోశారని తెలిపారు. వాంగ్మూలంలోనూ నిందితులు ఇదే విషయం చెప్పినట్టు పోలీసులు రిమాండ్ డైరీలో సైతం పేర్కొన్నారు. అయితే ఆ విషయం ఇప్పుడు ఆధారాలతో సహా ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది.
నవంబర్ 27వ తేదీ రాత్రి శంషాబాద్ సమీపంలోని చటాన్పల్లి వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి.. హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను డిసెంబర్ 6వ తేదీన పోలీసులు ఘటనా స్థలికి తీసుకెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.