అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. సచివాలయం వెళ్లే రహదారిని దిగ్బంధించారు. వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సచివాలయానికి, అసెంబ్లీకి వెళ్లే మార్గం కావడంతో మందడంలో రోడ్డుకు ఇరువైపులా పోలీసు బలగాలు మోహరించాయి.
మరోవైపు తూళ్లూరులోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. మహాధర్నా ప్రాంగణం వద్ద అంబేడ్కర్, మోదీ చిత్రపటాలతో రైతులు ధర్నాలో కూర్చుకున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అవహేళన చేసేలా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. పది మంది మంత్రులతో వేసిన హైపవర్ కమిటీ ఎవరి కోసమని ప్రశ్నిస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలింపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి.