అమరావతి: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మూడు రాజధానుల అంశం, అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానం తదితర కార్యక్రమాలపై ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాజకీయ వ్యవహారాల కమిటీ, వ్యూహాత్మక కమిటీల సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీతోపాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. కీలకమైన ఈ సమావేశానికి హాజరైన సభ్యుల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారు.
ఇటీవల పార్టీ సభ్యులు నాదెండ్ల మనోహర్, నాగబాబు, ముఖ్య నాయకులు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. అమరావతిలోని రైతులను, ప్రజలను కలుసుకుని.. వివిధ సమస్యలపై చర్చించారు. దీనిపై ఓ నివేదికను కూడా తయారు చేశారు. ఈ నివేదికను ఇప్పటికే పవన్ కళ్యాణ్కు అందచేశారు. ఆ పరిశీలన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానంపై పవన్ మాట్లాడనున్నారు. జనసేన నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించనున్నారు.