(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి ప్రాంతం వెలగపూడి, మాల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలాన్ని రేపుతున్నాయి, పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నందున పోలీసు స్టేషన్కు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దాదాపు 15మంది రైతులకు, రైతు కూలీలకు నోటీసులు జారీ చేశారు.
పోలీసులు ఇచ్చిన నోటీసులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న తమపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అయిదు గంటల లోపు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హజరు కావాలని చెప్పడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్ కార్డు తీసుకుని స్టేషన్కు రావాలని నోటీసులో పేర్కొన్నారు. చిన్న చిన్న ఘటనలపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకల జనుల సమ్మెను అడ్డుకొనే కుట్రలో భాగంగానే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.దోపిడీ, హత్యాయత్నం కేసులు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. హత్యలు చేసేవారు, దోపీడీలకు పాల్పడేవారు ఎవ్వరూ లేరని పోలీసులకు తేల్చి చెప్పామన్నారు. ఇక్కడంతా రైతులు, రైతు కూలీలే ఉన్నారనీ, నోటీసుల స్వీకరణకు నిరాకరించామని చెప్పారు. కొందరిని చిలకలూరిపేట, మరికొందరిని తెనాలి, ఇంకొందరిని గుంటూరు స్టేషన్లకు రావాలంటూ పోలీసులు బృందాలుగా తిరగడంపై రైతులు తప్పుబడుతున్నారు.
తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి పీఎస్లను కాదని ఎక్కడెక్కడో పీఎస్ల్లో జారీ చేసిన నోటీసులకు తమకు సంబంధం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మీడియా ప్రతినిధులపై దాడి చేశారన్న అభియోగంతో ఇటీవల రాజధాని ప్రాంతంలో ఏడుగురిని హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేసి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. వీరిని మంగళగిరి కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి తొలుత 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ వెంటనే నిందితుల తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ పోలీసులు తప్పుడు అభియోగాలు మోపారని చెప్పడంతో విచారణ జరిపిన న్యాయమూర్తి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. రైతులను ఏ కారణంతో అరెస్టు చేశారు?, కత్తులు ఎక్కడ?, ఎవరైనా ఐసియూలో ఉన్నారా?, వీరి నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఏవి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులు కిమ్మనకుండిపోవడంతో అరెస్టు అయిన రైతులందరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఇలాంటి ఘటనలు మరో సారి పునరావృత్తం కావద్దని పోలీసులను హెచ్చరించారు. దీంతో రైతులంతా ఆ మధ్యాహ్ననికే విడుదల అయ్యారు.
ఈ నేపథ్యంలో మరో 15 మందికి విచారణ హజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.