(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. వివేకా హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, టిడిపి నేత బిటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై ఈ నెల 19 లోపు కౌంటర్ వేయాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకూ తుది నివేదికను రూపొందించవద్దని సిట్కు సూచించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ విచారణ తుది దశలో ఉందనీ, ఈ దశలో దర్యాప్తును సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టుకు ఏ జి తెలిపారు.
ఈ వ్యవహారంలో కేంద్రం, సీబీఐలతో పాటు వ్యక్తిగత ప్రతివాదుల అభిప్రాయం కూడా తెలుసుకోవాలనీ, వారికి కూడా నోటీసులు జారీ చేయాలనీ అభ్యర్థించారు.
ఇరువర్గాల వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ కేసులో వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబిఐ డైరెక్టర్ తదితరులతో పాటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేసింది. సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేశారు.