ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో తరలిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక ఛానల్లో యాంకర్ గదమాయించి లెక్చరిస్తూ ఉంటాడు, మరో దానిలో ఇంకో పొలిటీషియన్ కేకలేస్తూ ఉంటాడు, ఇంకొక ఛానల్లో ఏదో వార్తా దృశ్యం పెద్ద చప్పుడు లేకుండా సాగుతూ ఉంటుంది. ఇలా దేనికదే ప్రత్యేకం. పోలికలు చాలా తక్కువ, తేడాలు బహు ఎక్కువ. చేతిలో రిమోట్ ఉంది కనుక ఛానల్ మార్చాం లేదా ఛానల్ లో ప్రకటనలు వచ్చాయి కనుక మరో ఛానల్ కు వెళ్తున్నాం – అనే ధోరణి ఉంది. కనుక పూర్తి వార్తల బులెటిన్ చూడటం అనేది చాలా తక్కువ. కానీ సీరియల్స్ ఎపిసోడ్లు వదలకుండా (ప్రకటనలు వదిలేసి అవసరమనుకుంటే) చూస్తారు. అదే న్యూస్ ఛానళ్ళకూ, వినోదపు ఛానళ్ళకు ఉండే తేడా!
ఈ జాతర సందోహంలో వార్తాఛానళ్ళు చూసిన వీక్షకుడికి ఏమి చూశామో, ఎందులో చూశామో, ఎంత మాత్రమూ గుర్తుండే అవకాశం లేదు. ఛానళ్ళు కూడా తమ వనరుల లేమి కారణంగా కొన్ని అంశాలు చూపవు. కొన్ని ఛానళ్ళు కొన్ని విషయాలను తమ పాలసీ కారణంగా చూపవు. చూపినా మొక్కుబడిగా చూపుతారు. ఇంకా కొన్ని సందర్భాలలో తమ వద్ద ఫుటేజి ఉందని కాస్తా ఎక్కువగానే చూపుతారు. అయితే జాగ్రత్తగా చూస్తే – మరీ జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్నివిషయాలు బోధపడతాయి. అన్నీ తెలిసినట్టే ఉంటుంది. ఏదీ అవగాహనకు రాదు. కనుకనే మరుసటి రోజు పత్రికలు చదవాల్సి వస్తోంది. ఛానళ్ళు కల్పించే పరిమితి పత్రికలకు బలమవుతోంది.
ఆదివారం సాయంకాలం తెలుగు వార్తాఛానళ్ళు చూస్తే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, – ఛానల్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బిజేపి ప్రచారం దృశ్యాలు ఎక్కువసేపు చూపించిందనిపించింది. ఇది చాలా జాగ్రత్తగా గమనించిన తర్వాత స్ఫురించింది. రెండు రాష్ట్రాలు, పలు పార్టీలు, పలు నాయకులు, పలు వాణిజ్యవేత్తలు – పార్టీల బట్టి, నాయకులబట్టి, ఛానళ్ళ యజమానుల బట్టి వార్తా పంపిణి సాగుతుంది కదా! చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ వార్తాలకే ఎక్కువ ప్రాధాన్యత వుంది. చంద్రబాబును విమర్శించడం వంటి కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కెసిఆర్ వార్తలలో ప్రముఖంగా ఉంటారు. ఈ ధోరణి కాకుండా ఆర్టీసి సమ్మెకారణంగా తెలంగాణ వార్తలు ప్రముఖస్థానం ఆక్రమిస్తున్నాయి.
తీన్మార్ వార్తలు అని వి6 ఛానల్ రాత్రి 9.30కు ప్రసారం చేస్తోంది. వి6 ఛానల్ లో ఇదే ఎక్కువ మంది చూసే కార్యక్రమం. పోటీ కారణంగా యాంకర్లను లాగేసుకోవడం కొత్తకాదు. తీన్మార్ లోని సత్తిని టీవీ9 స్వీకరించి అదే సమయంలో ఇస్మార్ట్ న్యూస్ ఇస్తోంది. కొన్ని మార్పులు చేసి వార్తాంశాలనే కాస్త వ్యంగ్యం కలిపి ఇస్తోంది. ఇందులో నారాయణ వార్తలే మెరుగ్గా ఉన్నాయనిపిస్తోంది. అటు న్యూస్ మల్లన్నకూ, ఇటు తీన్మార్ కు పోటీ ఇచ్చే ఉద్దేశంతో ఎన్టీవి రాత్రి ఎనిమిదిన్నరకు గోలీమార్ ఇస్తోంది. అయితే ఇది వార్తల ఆధారంగా కాకుండా వ్యంగ్యం ఆధారంగా రూపొందించారు. కాంటెంపరరీ స్వభావం లేకపోతే బోరు కొట్టే అవకాశం ఉంది. అంతకు మించి వ్యంగ్యం శృతిమించితే ప్రమాదం. భర్తకు ఫోన్ చేసి నీ భార్యకు పెళ్ళి సంబంధాలు చూస్తామనడం హాస్యమా? వ్యంగ్యమా? లేదా మరొకటా? ఇలాంటి విషయాలలో జాగ్రత్తపడకపోతే ఇబ్బందులు తప్పవు.
టెక్నాలజి ఉందని విసిగించడం అవసరమా? ఇటీవల బతుకమ్మ సంబరాలు, దేవీ నవరాత్రులు, తిరుమల బ్రహ్మోత్సవాలు – మూడూ రావడంతో బుల్లి తెరను నాలుగు భాగాలు, ఆరు భాగాలు చేసి రకరకాల దృశ్యాల ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంత అవసరమా? చూపించామని చెప్పుకోవడానికే తప్ప చూశారని ఆనందపడటానికి కాదు!
డా. నాగసూరి వేణుగోపాల్
9440732392