(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ ఉద్దండరాయునిపాలెంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న కాలభైరవ యాగం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది.
ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ అమరావతి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. త్వరలో తిరుపతిలో లక్ష మందితో మహాసభ నిర్వహిస్తామని చెప్పారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అనేది దైవ సంకల్పమని అన్నారు.
ప్రధాని మోది వచ్చి శంకుస్థాపన చేసినప్పుడే ఇది ఆంధ్రుల రాజధాని అయ్యిందన్నారు. 153 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రధాని మోదిని కలిసి అమరావతి రాజధానిగా ఉంచాలని కోరుతామని శివస్వామి తెలిపారు. శ్రీకాకుళం, తిరుపతి నుండి అమరావతికి పాదయాత్ర చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్నారు.