అమరావతి: రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది. ఈ రెండు బిల్లులకు రెండు సెలక్ట్ కమిటీలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. తొమ్మిది మందితో సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు మండలి చైర్మన్.. రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. సెలక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలని ఆయన కోరారు.
ఒక్కో సెలక్ట్ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారని మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. ఆ కమిటీకి సంబంధిత బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి చైర్మన్గా ఉంటారు. ఐదుగురు టీడీపీ సభ్యులు, ఒక వైసీపీ, ఒక పీడీఎఫ్, ఒక బీజేపీ సభ్యుడు అందులో సభ్యులగా ఉంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు మీద ఏర్పాటయ్యే సెలక్ట్ కమిటీకి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఆర్డీఏ రద్దు బిల్లు మీద ఏర్పాటయ్యే సెలక్ట్ కమిటీకి మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీల్లో సభ్యులను సూచించాల్సిందిగా ఆయా పార్టీలకు శాసనమండలి చైర్మన్ విజ్ఞప్తి చేశారు. కమిటీ సభ్యులను ప్రతిపాదించిన తర్వాత పూర్తిస్థాయిలో కమిటీ ఏర్పాటు కానుంది.
మండలి రద్దు దిశగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వెలువడుతున్న వేళ.. శాసన మండలి చైర్మన్ తన పని తాను చేసుకుపోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. కాగా, శాసనసభ ఆమోదించిన అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే.