నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని, త్వరలోనే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అరవింద్ మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నది తప్పుడు నిర్ణయని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే కాంగ్రెస్ పార్టీ పతనమైందని, అదే గతి టీఆర్ఎస్ కు పడుతుందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని స్పష్టం చేశారు. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే మహిళలకు పెన్షన్ ఆపివేస్తామని బెదిరించారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పు చేశానని ముక్కు నేలకు రాయాలని వ్యాఖ్యానించారు. బీజేపీ గాలికి కేసీఆర్, కేటీఆర్ కొట్టుకుపోతారని, ముఖ్యమంత్రి తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడడం లేదన్నారు. కేసీఆర్ హిందువుగా పుట్టినందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నందుకు భారతదేశం సిగ్గుపడుతుందని అరవింద్ విమర్శించారు.
నిజామాబాద్ ప్రజలు బీజేపీకి అనుకూలంగా, ఎంఐఎంకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. నిజామాబాద్లో టీఆర్ఎస్ కు ప్రజలు మూడో స్థానాన్ని కట్టబెట్టారని చెప్పారు. బీజేపీ హవా నిజామాబాద్లోనే కాదు రాష్ట్రంలో కూడా కొనసాగుతుందన్నారు. నిజామాబాద్లో పోలీసులు టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవుతోందని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు.
కాగా, పౌరసత్వ చట్టాన్ని(సీఏఏ) తాము వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం(జనవరి 25) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. కులాలు, మత విశ్వాసాలకు అతీతంగా… భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు ఇస్తోందన్నారు. ముస్లింలను ఎలా పక్కన పెడతారని అయన ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, ఇప్పటికే పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించామని గుర్తు చేశారు. ఒక లౌకిక వాద పార్టీగా వందకు వంద శాతం తాము వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.