ఇటీవల కన్నుమూసిన ప్రముఖ తెలుగు రచయిత ఆదివిష్ణు, నా చిన్నప్పుడు “జ్యోతి” మాసపత్రికలో ఒక నవల రాశారు. దాని శీర్షిక “రాక్షసీ, నీ పేరు రాజకీయమా? వర్ధిల్లు!”. ప్రస్తుతం మనదేశంలో పాలకులూ, వారి శ్యాలకుల ఆశీర్వాదబలంతో సాగుతున్న అరాజకీయాలను చూస్తుంటే “రాక్షసీ, నీ పేరు అరాజకీయమా? వర్ధిల్లు!” అనాలని అనిపిస్తోంది.
“అరాచక జీవితాన్ని కానీ, నియంతృత్వం కాడి కిందపడి నలిగే అభాగ్య జీవితాన్ని కానీ మనమెప్పుడూ ఆదర్శప్రాయమన్నట్లు చిత్రించకూడదు!” అని నిషేధించాడట గ్రీకు విషాద నాటక కర్త ఎస్కిలస్. క్రీస్తుకు పూర్వం ఆరు-అయిదు శతాబ్దాలకు చెందిన ఎస్కిలస్ కు ఉన్న చైతన్యం ఈ కాలపు మహానాయకులకూ, వారి అడుగులకు మడుగులొత్తే రక్షకభటులకూ, ప్రభువర్గీయులుగా మారి తరించిపోవాలని తహతహలాడే మీడియా తాంత్రికులకూ కరువు కావడం నిజమైన విషాదం. రెండున్నర వేల సంవత్సరాల నాగరికత మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలమని చెప్పుకునే ఈ శక్తులకు ఏమైనా నేర్పగలిగిందా అనే ప్రశ్న ఇప్పుడు ఎదురుకావడం కన్నా విచారకరమైన -కాదు, కాదు దౌర్భాగ్యకరమైన- విషయం వేరే ఉంటుందా??
సరిగ్గా వారం రోజుల కిందట దిల్లీలోని జవాహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.యెన్.యూ.) హాస్టళ్లపై మతోన్మాదులు జరిపిన దాడులు- అంతకు మించి పాలక వర్గాలు ఈ చీకటి శక్తులకు తెగబడి అందించిన సహాయ సహకారాలూ చూస్తుంటే ఇలాంటి అనుమానాలు తలెత్తడం సహజం. దాడుల్లో బాధితులైన జె.యెన్.యూ.విద్యార్థి సంఘం నేతలనే నిందితులుగా చూపిస్తూ చార్జిషీట్ దాఖలు చెయ్యడం కన్నా విపరీతం ఏముంటుంది? సోషల్ మీడియా గ్రూపుల ద్వారా వెల్లడైన చీకటి కోణాలపై మన రక్షక భటులు చూపు సారించేసరికి వూరు మాటుమణిగిపోయే ప్రమాదం వుంది. ఇక, నిద్ర నటించే చెక్కభజన మీడియా తమకు నచ్చని నిజాలను కనదు-వినదు- అనదు! ఇటువంటి స్థితిలో జె.యెన్.యూ.పై బురదజల్లుడు కార్యక్రమం ఊపందుకోవడంతో వింతేముంది?
జె.యెన్.యూ.లో “సిసలైన”విద్యార్థులే లేరనీ, ఆ సంస్థను కొన్నేళ్లపాటు మూసిపెట్టివుంచాలనీ కొందరు మేధావులు ఉచితసలహాలు ఇస్తున్నారు. ఈ పెద్దమనుషులు చేసే అనుచిత వ్వ్యాఖ్యానాలకు వాస్తవాలు యోజనాల దూరంలో ఉన్నాయి. జె.యెన్.యూ. మన దేశంలోనే కాదు, దేశదేశాల్లో ప్రసిద్ధి చెందిన విజ్ఞానాలయం. ప్రగతిశీల భావనలను – ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని- లోతుగా అధ్యయనం చేసే విద్యాసంస్థగా జె.యెన్.యూ. సుప్రసిద్ధం. అసలు అందుకే ఈ పెద్దమనుషులకు జె.యెన్.యూ. అంటే అంత కడుపు మంట! ఈ విశ్వవిద్యాలయానికి ఇంతటి ప్రశస్తి ఒక్క రోజునే వచ్చి పడిపోలేదు. బిపన్ చంద్ర, ఎస్.గోపాల్, రొమిల్లా థాపర్, ఆరెస్ శర్మ తదితరులు రేయింబవళ్లు కృషి చేసినందువల్లనే దానికి అంత ఖ్యాతి వచ్చింది. వికీపీడియా చెప్పే సమాచారం ప్రకారం, 2019 జాతీయ విద్యాసంస్థల రాంకింగ్ ప్రమాణాల ప్రకారం -ఎం ఐ ఆర్ ఎఫ్ లెక్కల ప్రకారం- జె.యెన్.యూ. -ఐఐటీల సరసన- ఏడో స్థానంలో ఉంది. ఈ సంస్థ కన్నా పైన ఉన్న విద్యాసంస్థలన్నీ ఐఐటీలే. ఇది హఠాత్తుగా, ఇప్పుడే సాధ్యమైన ఘన విజయమేం కాదు. 2016 లో జె.యెన్.యూ. ఈ ర్యాంకింగ్ లో మూడో స్థానంలో నిలిచింది. మరుసటి సంవత్సరం రెండో స్థానానికి ఎదిగింది. 2017 లోనే ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రపతి పురస్కార పతకం సాధించి, దేశంలోనే అత్యుత్తమమైన విశ్వవిద్యాలయంగా గౌరవం పొందింది. అటువంటి విశ్వవిద్యాలయం పై మతవాదులకు, మితవాదులకూ కన్నుకుట్టడంలో వింతేముంది. అలాంటి మత-మితవాదులు వాస్తవాలతో సంబంధం లేని దుష్ప్రచారానికి ఒడిగట్టడంలో విడ్డూరమేముంది??
జె.యెన్.యూ. అధ్యాపకుల్లో అత్యధికులు ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించారు, ఖండిస్తూనే వున్నారు కూడా. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు -విద్యార్థులూ, అధ్యాపకులూ కూడా- ఈ దాడులను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. బెంగళూరు ఐఐఎమ్ విద్యార్థులు, కొందరు అధ్యాపకులూ సృజనాత్మక శైలిలో జె.యెన్.యూ.హాస్టళ్లపై జరిగిన దాడులపట్ల నిరసన ప్రకటించారు. 144 సెక్షను విధించిన నేపథ్యంలో వాళ్ళు అలా చెయ్యడం గమనార్హం.
ఇంతకీ, జె.యెన్.యూ. హాస్టళ్లపై దాడులు ఎందుకు జరిగాయి? ఎలా జరిగాయి? ఎవరి ప్రేరేపణతో జరిగాయి?? ఈ విషయాలపై నిష్పాక్షికమైన విచారణ జరగాలి. జె.యెన్.యూ.ప్రాంగణంలో ఎన్నో హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లో ఎందరో విద్యార్థులు ఉంటున్నారు. ఎంపిక చేసిన కొన్ని హాస్టళ్లపై కొందరు “ముసుగు మనుషులు(?)” కిందటి ఆదివారం జరిపిన దాడుల వార్త దేశంలోని మేధావులూ, బుద్ధిజీవులూ, ప్రజాస్వామ్యవాదుల మనసులలో కలకలం రేపింది. “ద హిందూ” లాంటి పత్రిక ఈ ముసుగు వీరుల దాడులపై ఏకంగా ఒక సంపాదకీయమే రాసింది. యోగేంద్ర యాదవ్ లాంటి ప్రముఖులు ప్రత్యక్షంగా జె.యెన్.యూ.హాస్టళ్లు ఉన్న ప్రాంతానికి తరలి వెళ్లారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా కుమార్తె ఆ హాస్టల్ లో ఉంటున్నారు. ఆమె భద్రతా గురించి తెలుసుకునే నిమిత్తం ఆయన అక్కడికి వెళ్లారు. కానీ రక్షక భటులు వారిని లోనికి అనుమతించ లేదు!
కాగా, కేంద్ర ప్రభుత్వానికి చెక్కభజన చెయ్యడానికే తమ జీవితాలను అంకితం చేసిన “ప్రముఖ” ప్రసార సంస్థలు మాత్రం ఈ సంఘటనపై స్పందించిన తీరు విడ్డూరంగా ఉంది. సీనియర్ జర్నలిస్టు నామధారులైన కొందరు మహానుభావులు వాస్తవాలకు మసిపూసి మారేడుకాయలు చెయ్యపూనడం వారి వ్యక్తిత్వాలను బయటపెట్టింది. “వాస్తవాలు పవిత్రమైనవి; వాటి జోలికి పోకూడదు- అభిప్రాయాలంటారా అవి మన సొంతం!” అని చెప్పింది సి.పీ.స్నో అనుకుంటా. నూరేళ్ళ కిందట చెప్పిన ఇంత గొప్ప విషయాన్ని ఈ మహానుభావులూ, మాంత్రికులూ, తాంత్రికులూ లెక్కచెయ్యకపోవడం వాళ్ళ సంస్కార విశేషాన్ని పట్టిస్తోంది.
మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలని చెప్పుకునే వ్యవస్థలు ఎస్కిలస్ బోధనల సారాన్ని గ్రహించారా అనే అనుమానం తలెత్తడానికి కారణం ఇదీ! చిత్తగించవలెను!!
– మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ