తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందవు అని ఆయన అన్నారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.అమరావతిలో రేపు వామపక్షాల పర్యటన ఉంటుందని ఆయన ప్రకటించారు. అమరావతి 29 గ్రామాల ప్రజల ఆందోళన కాదనీ, అయిదు కోట్ల మంది ప్రజల ఆవేదన అనీ రామకృష్ణ తెలిపారు
.ఏపికి కావాల్సింది ప్రత్యేక హోదానేననీ ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అఖిలపక్షాన్ని కలుపుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సలహాదారులు ఎక్కువై జగన్ కన్ఫ్యూజ్ అవుతున్నారనీ, అందుకే అన్ని నిర్ణయాలు తప్పులతడకగా ఉన్నాయని ఆయన విమర్శించారు.