న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. యూనివర్శిటీ సమీపంలోని జామియా, ఓఖ్లా ప్రాంతాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో విద్యార్థులెవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టయిన వారిపై గతంలో నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం(డిసెంబర్ 15) సాయంత్రం న్యూ ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో జేఎంఐ విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. తొలుత ఆందోళనకారులు నాలుగు బస్సులకు నిప్పంటించారు. వారిని అదుపుచేసే క్రమంలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే అల్లర్లలో జామియా యూనివర్శిటీకీ చెందిన పలువురు విద్యార్ధులు కూడా గాయాలపాలయ్యారు. దాదాపు రెండు వేల మంది ఆందోళన కారులు ఈ ఘటనలో పాల్గొన్నారనీ… ప్రభుత్వ బస్సులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించారని ఆగ్నేయ ఢిల్లీ పోలీస్ కమిషనర్ చిన్మయి బిస్వాల్ తెలిపారు.
మరోవైపు విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీను నిరసిస్తూ సోమవారం(డిసెంబర్ 16) దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల్లో విద్యార్థులు ఫెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వర్సిటీ ప్రాంగణాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.