అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల ఆందోళన ఆరో రోజు కొనసాగుతోంది. అయితే, ఈ ఆందోళన జరుగుతున్న నాటి నుంచి ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని.. ఆయన్ను వెతికిపెట్టాలని పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.
‘రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదు. మా ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము’ అని ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు.
మరోవైపు ధర్నా చేసేందుకు తుళ్లూరులో టెంట్ వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తుళ్లూరులో పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. వందలాది మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. మంగళగిరిలోనూ రైతులు ధర్నా నిర్వహిస్తున్నారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అరగుండు, సగం గీసేసిన మీసంతో వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. రాజధానిని మార్చే ఆలోచన మార్చుకోవాలని లేదనంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెలగపూడిలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. అమరావతికి ప్రయాణం ఎడారిలో ఉన్నట్లుందంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు.