(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారు ? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దేవేందర్ ఫడ్నవీస్తో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ను ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్లో తీసుకుంటారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. తొలుత ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ డిప్యూటీ సీఎం అవుతారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది.
పార్టీని ధిక్కరించి బీజేపీతో కలసి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్.. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్లీ సొంతగూటికి చేరారు. దీంతో ఆయనకు మళ్లీ డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించాలని ఎన్సీపీలోని ఓ వర్గం కోరుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే లాంఛనమే అనుకుంటున్న తరుణంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ను బీజేపీ తనవైపు తిప్పుకుని నవంబర్ 23న కోడికూసిన వేళకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే, దీనిపై శివసేన, ఎన్సీపీచ కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం, కుటుంబ సభ్యుల ఒత్తిడితో అజిత్ మనసు మార్చుకుని ఎన్సీపీ చెంతకు చేరడం, ఫడ్నవీస్ రాజీనామా చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో కూటమి తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనతోపాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇద్దరేసి చొప్పున ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, ప్రమాణస్వీకారం చేసే మంత్రుల జాబితాలో అజిత్ పవార్ పేరు కనిపించలేదు. దీంతో ఆయన మస్తాపానికి గురయినట్లు ప్రచారం జరిగింది. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి ముందు అజిత్ పవార్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో.. ఎన్సీపీ నేతలు ఆందోళనకు గురైయ్యారు. మంత్రివర్గంలో తనకు చోటుదక్కలేదన్న అసంతృప్తితో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకార వేడుకకు అజిత్ హాజరుకావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమని సమాచారం. అసెంబ్లీలో బలపరీక్ష తర్వాత అజిత్ పవార్ను డిప్యూటీ సీఎంగా నియమించనున్నారు. కేబినెట్ విస్తరణలో అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని ఎన్సీపీకి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.
నిజానికి, అజిత్ పవార్ బీజేపీవైపు వెళ్లినప్పుడు… ఆయన వెంట ఎమ్మెల్యేలు ఎవ్వరూ వెళ్లలేదు. ఆయన్ని శాసనసభ పక్ష నేతగా తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు తిరిగి రాగానే ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ అదే ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండటం విశేషం. బీజేపీ నుంచి తిరిగి తన శిబిరానికి వచ్చాక, ఆయనపై ఎలాంటి విముఖతా వ్యక్తం కానీయకుండా శరద్ పవార్ జాగ్రత్తలు పడ్డారని తెలుస్తోంది. మొత్తం మీద అజిత్కు డిప్యూటీ సీఎం పదవి దక్కితే కీలకమైన హోం శాఖ బాధ్యతలను జయంత్ పాటిల్కు అప్పగిస్తారని సమాచారం.