(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి రాజధాని వివాదం నేపథ్యంలో 151 మంది వైసిపి ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరాలనీ, లేకుంటే రాజధానిపై ఓటింగ్ పెట్టాలనీ టిడిపి అధినేత చంద్రబాబు చేసిన సవాల్కు చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత ఆమంచి కృష్ణ మోహన్ స్పందించి ప్రతి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజాతీర్పును అవమానించినట్లు అవుతుందని ఆయన అన్నారు. టిడిపికి బలంగా ఉండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు పార్లమెంట్ సభ్యులను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమయితే వాటిలో మెజారిటీ స్థానాలు వైసిపి గెలవడం ఖాయమనీ, అందులో మెజారిటీ స్థానాల్లో వైసిపి గెలవకపోతే చంద్రబాబు చెప్పినదానికి కట్టుబడి ఉంటామనీ ఆమంచి అన్నారు.
పది సంవత్సరాల హక్కు కల్గి ఉన్నప్పటికీ రాజధానిని హైదరాబాదు నుండి తాడికొండకు తరలించి గుత్తాధిపత్యం శాశ్వతంగా సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నించినా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఆయన అనుయాయులు అందరూ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని అన్నారు. ఆ ప్రాంతానికి రాజధాని వచ్చినప్పటికీ వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. రాష్ట్ర జనాభాలో 0.2శాతం మంతి మాత్రమే రాజధాని అమరావతి కోసం పోరాటం సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సానుభూతి కోసం మహిళలను ఆందోళన పేరుతో రోడ్డుపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు.ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని ఉద్యమం చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. ఇది నిజమైన ఉద్యమం కాదని ఆమంచి పేర్కొన్నారు. మహిళలను గౌరవించే సంప్రదాయం నుండి వచ్చిన వ్యక్తి జగన్ అని అన్నారు.చంద్రబాబు ఆర్థిక మూలాలు పోతున్నాయని తెగ బాధపడుతున్నారనీ అందుకే కృత్రిమ ఉద్యమానికి తెరలేపారనీ ఆయన విమర్శించారు.
వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనా చౌదరి అమరావతి రాజధాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతికి ఆయనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.అమరావతిలో అభివృద్ధి ఆగిపోతుంది, భూములు ధరలు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రాజధాని ప్రాంతంలో అసెంబ్లీ, హైకోర్టు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
అధికార వికేంద్రీకరణను రాష్ట్ర ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని ఆమంచి చెప్పారు. బోగి మంటల్లో సిఎం జగన్ ఫోటోలు, బోస్టర్ కమిటీ, జీఎన్ రావు కమిటి రిపోర్టులు కాల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. సంక్రాంతి పండుగ జరుపుకోవద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చినా ఆయన అనుయాయులు తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారని ఆమంచి అన్నారు.