అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పటి వరకూ ఏటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో రాజదాని ప్రాంత ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై ఇంత వరకూ స్పష్టత లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అమరావతిపై ఏటువంటి ప్రకటన చేయలేదు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాత్రం రాజధాని అమరావతిపై విలేఖరులు ప్రశ్నించగా భూ సేకరణలో పెద్ద ఎత్తున అవినీతి, ఆశ్రిత పక్షపాతం చోటుచేసుకున్నాయనీ, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని జగన్మోహనరెడ్డి నాడు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 25శాతం దాటని అన్ని రకాల నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు చాలా వరకు తాత్కాలిక నిర్మాణాలే చేపట్టారు. శాశ్వత భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రచార సభల్లోనూ రాజధాని అమరావతి అభివృద్ధికి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్థావించకపోగా వైసిపి మానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చలేదు. తాజాగా నిన్నటి గవర్నర్ ప్రసంగంలోనూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలలో అమరావతి ఊసే చెప్పలేదు. దీంతో సిఆర్డిఎ పరిధిలో భూములు ఇచ్చిన రైతాంగంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంత ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ ప్రసంగంలో రాజధాని అభివృద్ధి గురించి ప్రస్థావించకపోవడాన్ని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. అయితే శనివారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ రాజధానిపై అపోహలు అనవసరమనీ, ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెస్తామనీ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒక పర్యాయం వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నేడు మంత్రి బొత్సా సత్యనారాయణలు దీనిపై ప్రకటనలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నుండి రాజధాని నిర్మాణాలపై స్పష్టమైన వైఖరి, విధానం వెల్లడికాకపోవడంతో ప్రజల్లోని అనుమానాలు తొలగిపోవడం లేదు.