(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో ఆయనను క్రియాశీలంగా లేకుండా చేసేందుకే అకస్మాత్తుగా జనసేనతో పొత్తు పెట్టుకున్నదని బలంగా ప్రచారంలో ఉంది. అటు పవన్ కళ్యాణ్ ఇటు బిజెపి నేతల ప్రవర్తన కూడా దానిని బలపరిచే విధంగానే ఉన్నది.
తాజాగా పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు వెళుతున్నారు. విషయం ఏమిటయ్యా అంటే అప్పుడెప్పుడో అత్యాచారానికి గురయిన ఒక యువతికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేయడం కోసం స్వయంగా కర్నూలు వెళ్లాలని పవన్ నిర్ణయించారు. నిజానికి అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ ఒక అభాగ్యురాలి కోసం కర్నూలు వెళ్లగలిగిన పవన్ రాజధాని మార్పిడి వంటి అంశంలో ఎలాంటి పోరాటం చేస్తున్నారన్న ప్రశ్న ఆ వెంటనే వస్తోంది.
రాజధానిని విశాఖ తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు రాజధాని గ్రామాలలో పర్యటిస్తుండగా బిజెపి పెద్దల నుండి వచ్చిన పిలుపు మేరకు ఆయన అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ రెండు పార్టీలూ పొత్తు ప్రకటించాయి. అమరావతి విషయంలో ఉమ్మడిగా పోరాడతామని కూడా రాష్ట్ర బిజెపి నాయకులు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.
పొత్తు తర్వాత రాజధాని ప్రాతంలో లాంగ్మార్చ్ నిర్వహిస్తామని ఇరు పార్టీల నాయకులు ప్రకటించారు. అది కూడా పది రోజుల తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపారు. తీరా చూస్తే అది కూడా జరగలేదు. అనివార్య కారణాల వల్ల లాంగ్ మార్చ్ వాయిదా వేస్తున్నామనీ, ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలుపుతామనీ ప్రకటించారు. ఆ తర్వాత ఇంతవరకూ రాలేదు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే కాస్త గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామని కన్నా ఎంత గట్టిగా చెబుతున్నారో రాజధాని మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమనీ, కేంద్రం జోక్యం చేసుకోబోదనీ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అంతే గట్టిగా చెబుతున్నారు. టిడిపి నుంచి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా అమరావతి తరపున మాట్లాడుతున్నారు. బాహటంగా వ్యక్తమవుతున్న ఈ భేదాభిప్రాయలను సరి చేసేందుకు బిజెపి అగ్ర నాయకత్వం ఇంతవరకూ ప్రయత్నించలేదు.