న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తా కథనాలు వస్తున్న విషయం వైసిపి ఎంపీల సమావేశంలో చర్చకు వచ్చింది. మంగళవారం ఢిల్లీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి నివాసంలో ఆ పార్టీ ఎంపిల సమావేశం జరిగింది. జాతీయ మీడియా వైఖరి దృష్ట్యా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీలు అందరూ కలిసి విస్తృత ప్రచారం కల్పించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. దీనికి సంబంధించి పలు అంశాలపై ఎంపిలకు విజయసాయిరెడ్డి సూచనలు చేశారు.
ఈ సమావేశంలో పలువురు ఎంపిలు నియోజకవర్గాల్లో తమకు అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమను పనులు చేయకుండా అడ్డుకుంటున్నారనీ, నామినేటెడ్ పదవుల భర్తీలోనూ ఎంపిలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రోటోకాల్ తమకు ఎందుకు ఇవ్వరంటూ విజయసాయిరెడ్డిని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నట్లు తెలుస్తున్నది. నామినేటెడ్ పదవులకు ఎంపికలో ఎంపిలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి ఎంపిలు జగన్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడితే సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎంపిలకు విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు.