గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. ఎన్ఆర్సీలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఆర్మీ అధికారుల పేర్లు గల్లంతవడం చర్చనీయాంశమైంది. ఇండియన్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF)కు చెందిన ఎమ్మెల్యే అనంత్ కుమార్ మాలో పేరు గల్లంతైంది. రాష్ట్రంలో రెండో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి పేరు జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.
జాబితా నుంచి తొలగించబడ్డ వారంతా విదేశీయులుగా పరిగణిస్తారు. మరోవైపు జాబితాలో పేర్లు లేకపోయినా ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని కేంద్రం ప్రకటించింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. ఎవరినీ నిర్బంధించబోమంటూ హామీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే.. జాబితాలో పేర్లు లేనివారు ట్రైబ్యునల్లో, హైకోర్టులో అప్పీలు చేసుకుని న్యాయం పోరాటం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 ట్రైబ్యునల్స్ ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 100 ట్రైబ్యునల్స్ పని చేస్తుండగా మరో సెప్టెంబర్ లో 200 ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మొత్తం ట్రైబ్యునల్స్ అందుబాటులోకి రానున్నాయి. అప్పీలు, విచారణ ప్రక్రియ పూర్తయ్యాక, ఫారెన్ ట్రిబ్యునల్ ‘విదేశీ పౌరులు’గా ప్రకటిస్తేనే చర్యలు ఉంటాయని చెప్పారు.
అసోంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులను తిప్పిపంపాలని డిమాండ్ చేస్తూ ఆరేళ్లపాటు ఉద్యమం జరిగింది. ప్రతిఫలంగానే అక్కడ ఎన్ఆర్సీని రూపొందిస్తున్నారు. ఇందులో పేరున్నవారు భారతీయ పౌరులు అవుతారు. అసోంలో అసలైన భారత పౌరుడెవరో, అక్రమ వలసదారుడెరో స్పష్టంగా గుర్తించడం ఎన్ఆర్సీ ఉద్దేశం. అసోంలోకి వలసలు, పౌరసత్వ వ్యవహారంపై 1950ల నుంచే వివాదం ఉంది. బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన వారు తమ భూమి, ఉద్యోగాల్లో పోటీపడతారని స్థానికుల ఆందోళన రేగుతోంది. 1971కి ముందు నుంచి అసోంలో ఉంటోన్న వారిని పౌరులుగా గుర్తించారు. దాంతో ఆ తరవాత వచ్చి అక్కడ స్థిరపడ్డవారి పరిస్థితి సందిగ్ధంలో పడింది. 2018 జులై 30న వెల్లడించిన ఎన్ఆర్సీ ముసాయిదా జాబితాలో దాదాపు 40 లక్షల మందికి చోటు దక్కలేదు. తాజాగా తుది జాబితాను విడుదల చేశారు.