(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై గురువారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తొలి రోజు సమావేశంలో పూర్తిగా ఆర్టీసీపైనే మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. విధుల్లో చేరేందుకు వస్తున్న కార్మికులపై ఎటువంటి వైఖరి అవలంబించాలి ? తాత్కాలిక సిబ్బందిని ఏం చేయాలి ? ప్రైవేటు రూటు పర్మిట్లతోపాటు మిగిలిన రూట్ల నిర్వహణ వంటివాటిపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
బేషరతుగా సమ్మెను విరమించి, డిమాండ్లన్నీ వదులుకొని మళ్లీ కొలువుల కోసం ప్రభుత్వం శరణుజొచ్చిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారా ? ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగిస్తే సంస్థలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి ? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 48 వేల మంది సిబ్బంది ఉన్నారు. 52 రోజు పాటు సమ్మె అనంతరం విధుల్లోకి చేరేందుకు వస్తున్న కార్మికులను ప్రభుత్వం అనుమతించడం లేదు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా సంస్థ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిందని, నష్టాన్ని భర్తీ చేయాలంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సిందేనని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకే 5,100 రూట్లను ప్రైవేటుపరం చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఆర్టీసీ ప్రైవేటీకరణ తర్వాత సంస్థకు అవసరమయ్యేది 24 వేల మంది మాత్రమే అని అంచనా వేస్తున్నారు. మరి మిగిలిన కార్మికుల భవిష్యతు ఏమిటి ? అన్నది సస్పెన్స్ గా మారింది.
ఆర్టీసీలో కొత్తగా శాశ్వత నియామకాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. సంస్థలోని కార్మికులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం, లేదా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీంను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్మికుల్లో 50 ఏళ్లు పైబడిన వాళ్లుకి వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 5,100 రూటు పర్మిట్లను ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం.. వాటిని పూర్తిగా గ్రామీణ మార్గాల్లోనే ఇవ్వనుందని సమాచారం. పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్న పల్లెవెలుగు రూట్లను ప్రైవేటు చేతికి అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలస్తోంది. అయితే, టికెట్ రేటును ఆర్టీసీ నిర్ణయించనుంది. ఇందుకోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు రూట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు, కేబినెట్ సమావేశంలో వీటిని ప్రతిపాదంచనున్నట్లు సమాచారం. బస్సుల ప్రైవేట రూటు పర్మిట్లక సంబంధించి ముందుగా నోటిఫికేషన్ జారీ చేసి, వాటిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగేతే తాత్కాలిక పర్మిట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.