హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి ఒకేసారి విచారించాలంటూ జగన్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతోపాటు సీబీఐ విచారణ ముగిసే వరకు ఈడీ విచారణను నిలిపివేయాలనే మరో పిటిషన్ ను కూడా కొట్టేసింది.
డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి విచారించాలని గతంలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసులో విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ జరపాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం డిశ్చార్జి పిటిషన్లన్నింటినీ కలిపి వినేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగానే వినాలని నిర్ణయించింది. అనంతరం ఈ కేసుల విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
మరోవైపు, పెన్నా ఛార్జిషీట్ లో అనుబంధ అభియోగ పత్రంపై శుక్రవారం విచారణ జరిగింది. అయితే, వ్యక్తిగత హాజరు నుంచి జగన్కు సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. గత శుక్రవారం(జనవరి 10) సీఎం హోదాలో తొలిసారి సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన చేసుకున్న వినతిని కోర్టు అంగీకరించింది. ఈ కేసులో మిగతా నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు కోర్టు హాజరయ్యారు.