(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సీబీఐలో మరో రగడ మొదలైంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే భట్నాగర్పై నకలీ ఎన్కౌంటర్లు, అవినీతి అరోపణలు చేస్తూ డీఎస్పీ ఎన్పీ మిశ్రా ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో) లేఖ రాశారు. ‘‘జార్ఖండ్లో 14 మంది అమాయకులను నకిలీ ఎన్కౌంటర్ చేయడంలో భట్నాగర్ ప్రమేయం ఉంది. సీబీఐ నుంచి భట్నాగర్ను తప్పించకపోతే సంస్థ దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. నకిలీ ఎన్కౌంటర్లలో ఆప్తులను కోల్పోయిన వారంతా సీబీఐ పదవిలో భట్నాగర్ ఉండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు’’ అని డీఎస్పీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సెప్టెంబర్ 25న పీఎంవో ఆఫీస్ తోపాటు సీబీఐ చీఫ్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్(సివిసి)లకు పంపించారు. అంతేకాకుండా ఐదు పేజీలతో మరో ఫిర్యాదును సివిసికి పంపించారు.
పలు అవినీతి వ్యవహారాల్లో కూడా భట్నాగర్ హస్తం ఉందనీ ఆరోపించారు. జాయింట్ డైరెక్టర్ అక్రమాలపై పలువురు వ్యక్తులు వివిధ సందర్భాల్లో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. గతేడాది నవంబర్లో ఛత్తీస్గఢ్ జర్నలిస్టు ఉమేశ్ రాజ్పుత్ హత్యకేసులో ముగ్గురు సీనియర్ అధికారులు ఆధారాలను మాయం చేసి, అవినీతికి పాల్పడ్డారన్నారు. మరోవైపు తన బదిలీ అంశాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్టోబర్ 1న ఈ పిటిషన్ విచారణకు రానుంది.
గతేడాది సీబీఐ అధికారులు అలోక్ వర్మ, ఆస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా.. ఇద్దరినీ సెలవుపై పంపింది.