అమరావతి: బాధితులను స్వగ్రామానికి తీసుకువెళ్లే వరకూ చలో ఆత్మకూరు ఉద్యమం ఆగదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉండవల్లిలోని తన నివాసం నుండి పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరుకు బయలుదేరిన చంద్రబాబును పోలీసులు కదలనివ్వలేదు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ తనను గృహ నిర్బంధం చేసి చలో అత్మకూరును అడ్డుకోలేరని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలను అరెస్టు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తన ఇంటికి పార్టీ నేతలను, మీడియాను రాకుండా చేయడం దారుణమని చంద్రబాబు అన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని చంద్రబాబు పేర్కొన్నారు. ఆత్మకూరుకు చెందిన 125 ఎస్సి కుటుంబాలను వారి గ్రామాలకు తీసుకువెళ్లే వరకూ రాజీలేని పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకునే ప్రశ్నలేదని చంద్రబాబు అన్నారు. డిజిపి, పోలీసులు ఎన్ని రోజులు అడ్డుకున్నా తమ పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు నివాసానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నివాసం నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు గేటును తాళ్లతో కట్టివేశారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.