భోపాల్: నామ్ దేవ్ దాస్ త్యాగి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. అదే కంప్యూటర్ బాబా అని చెప్పండి, వెంటనే గుర్తుపడతారు. ఒకప్పుడు ఆయన బీజేపీ అంటే చెవి కోసుకునేవారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పుణ్యమాని ఆయనకో ఉద్యోగం కూడా వచ్చింది. ఇంతకుముందున్న బీజేపీ సర్కారు ఆయనను నర్మదా పరివాహక ప్రాంత అభివృద్ధి కమిటీలో సభ్యుడిగా నియమించింది. ఇప్పుడు ఏకంగా అలాంటిదే మరో కమిటీకి ఆయన చైర్మన్ అయి కూర్చున్నారు. ‘మా నర్మదా, మా క్షిప్ర, మా మందాకిని రివర్ ట్రస్టు’కు చైర్మన్ అయ్యారు. కమల్ నాథ్ సర్కారు ఈనెల 8వ తేదీన ఆయనకు ఈ పోస్టు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించడానికి రెండురోజుల ముందే ఈ నియామకం జరగడం విశేషం.
ఇంతకుముందున్న బీజేపీ సర్కారులో కంప్యూటర్ బాబాను సహాయమంత్రి హోదాలో ఐదుగురి కమిటీలో సభ్యుడిగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ కమిటీకి రాజీనామా చేసి, సీఎంకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి ఆయన కాంగ్రెస్ పార్టీతో అంటకాగడం మొదలుపెట్టారు. దాంతో ఇప్పుడు నదీ పరిరక్షణ కమిటీకి ఆయనను చైర్మన్ చేసి కూర్చోబెట్టారు. అయితే, ఆయనకు ఏమైనా మంత్రి హోదా వస్తుందా రాదా అన్నది మాత్రం ఉత్తర్వుల్లో లేదు.
తమ డిమాండ్లు పట్టించుకోలేదని కొంతమంది బాబాలు బీజేపీ సర్కారుకు ఎదురుతిరిగారు. ప్రభుత్వభూములను ఆక్రమించి కట్టిన ఆలయాలను క్రమబద్ధం చేయాలన్నది వారి డిమాండ్లలో ప్రధానమైనది. బాబాలు తమవైపుంటే లోక్సభ ఎన్నికల్లో మేలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. ఇటీవలి కాలంలో హిందూత్వ బ్రాండుకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ కూడా శివాలయాలకు తరచు వెళ్లి వస్తున్నారు. ఇప్పుడు కంప్యూటర్ బాబా నియామకం కూడా ఇలాంటిదేనని పరిశీలకులు అంటున్నారు.