(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఉన్న ఢిల్లీలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగుతుందని, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని చెప్పారు.
ఎన్నికల నిర్వహణ కోసం 13,767 పోలింగ్ కేంద్రాలు, 90 వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ్టి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు జనవరి 14న నోటిఫికేషన్ వెల్లడించనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. అదే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. నామినేషన్ల దాఖలుకు జనవరి 21 చివరి తేదీ కాగా, జనవరి 23న పరిశీలన ఉంటుందన్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువును జనవరి 24గా అరోరా ప్రకటించారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు వ్యక్తిగతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయలేని పరిస్థితుల్లో ఉంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటేసే సౌకర్యం కల్పిస్తున్నట్టు సీఈసీ వెల్లడించారు. మొత్తం 1.46 కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొందింది. తాజాగా జరిగే ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుంది. కాగా, నామినేషన్ల గడువు ఈ నెల 21తో ముగుస్తోంది. గత ఏడాది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఢిల్లీలో జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.