(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విశాఖపట్నం:టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్ల బాబూరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బోస్టన్ నివేదకను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి, విజయ్కుమార్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బాబూరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులను గతంలోనూ చంద్రబాబు అనేక మార్లు అవమానించేలా వ్యాఖ్యలు చేశారని బాబూరావు అన్నారు.చంద్రబాబుతో పోరాడేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళతానని బాబూరావు పేర్కొన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ అయిగురు మంత్రులు ఆదివారం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ అధికార విధుల్లో భాగంగా ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ బిసిజి నివేదక వివరిస్తే చంద్రబాబు ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, దీనిపై విజయ్ కుమార్కు బేషరతుగా చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మంత్రులు లేఖలో డిమాండ్ చేశారు. అయితే ఈ విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఇంకా స్పందించలేదు.