ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
‘పిఎం నరేంద్ర మోది’ సహా రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఎలాంటి బయోపిక్లను ఎన్నికలు పూర్తయ్యేవరకూ విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది.
‘రాజకీయ పార్టీలకు గానీ, వ్యక్తులకు గానీ ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్లూ థియేటర్లలో,ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదు’ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖతో పాటు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ‘పిఎం నరేంద్ర మోది’ సినిమా నిలిచిపోయింది.
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోది బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై నిన్న విచారణ జరిపిన సుప్రీం కోర్టు దాన్ని కొట్టి వేసింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండానే విడుదలపై స్టే ఇవ్వాలని కోరడం తగదని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సినిమా విడుదల విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమనీ, ఎన్నికల సంఘమే దీన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మోది బయోపిక్ కారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి లాభమో కాదో కూడా ఎన్నికల సంఘమే తేల్చాలని పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తున్నందున సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘పిఎం నరేంద్ర మోది’ చిత్ర నిర్మాతలకు, బిజెపికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నిర్మాతలు, బిజెపి నుంచి వివరణ తీసుకున్న అనంతరం సినిమా విడుదల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ ను జారీ చేసింది.