విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో తనదైన మార్కు కోసం ప్రయత్నిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపి సబ్బం హరి వ్యాఖ్యానించారు. వైసిపి వంద రోజుల పాలనపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. వైసిపి వంద రోజుల పాలన నూటికి నూరు శాతం ఫెయిల్ అయినట్లు ప్రజలతో పాటు తాను భావిస్తున్నానని హరి పేర్కొన్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు ఊహించని వేగంతో పోలవరం పనులు చేయించారని హరి అన్నారు. ఎన్డిఎ నుంచి టిడిపి బయటికి వచ్చిన తరువాత పోలవరం పనుల వేగం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు పోలవరం విషయంలో వైసిపి కేంద్రాన్ని ప్రభావితం చేసిందని హరి అన్నారు. పోలవరంలో అవినీతి జరగలేదని ఇప్పుడు కేంద్రమే చెబుతున్నదని హరి గుర్తు చేశారు. రీ టెండరింగ్కు వెళ్తే చిక్కులు వస్తాయని కేంద్రం చెప్పినా జగన్ పట్టించుకోవడం లేదని హరి పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని నిరూపించడానికి కుట్ర చేస్తున్నారని హరి ఆరోపించారు. అందులో భాగమే పోలవరంలో అవినీతి అంటూ తెరపైకి తెచ్చారని సబ్బం వ్యాఖ్యానించారు. జగన్ తన మార్క్ చూపించడానికే పోలవరం పనులు ఆపేయాలని చూస్తున్నారని హరి విమర్శించారు.
నవరత్నాలలో ఎన్ని ప్రజలకు చేరువ అయ్యాయో జగన చెప్పాలని హరి కోరారు. ప్రభుత్వం పాజిటివ్ థృక్పథంతో వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని హరి అన్నారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చి ఏం సాధించారని హరి ప్రశ్నించారు. దాన్ని ప్రభుత్వం వాడుకున్నా బాగుండేదని హరి అభిప్రాయపడ్డారు. ఈ రోజు వరకు కరకట్ట మీద ఉన్న ఏ ఒక్క భవనాన్ని కూల్చలేదని హరి అన్నారు. సిఎం జగన్ ఆలోచనా ధోరణి సరిగా లేదనడానికి ఇదే నిదర్శనమని హరి పేర్కొన్నారు.