పాక్ దళాలకు చిక్కినట్లే చిక్కి, విజయవంతంగా స్వదేశానికి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారా? లోక్ సభ ఎన్నికలలో అదే పార్టీకి ఆయన ఓటు వేశారా? అచ్చం అభినందన్ వర్ధమాన్ లాగే కనిపించే ఒక వ్యక్తి మెడలో కాషాయ కండువా ధరించి దాని మీద బీజేపీ గుర్తు కూడా పెట్టుకుని పోలింగ్ కేంద్రం నుంచి వస్తున్నట్లు బీజేపీ అనుకూల సోషల్ మీడియా పేజీలలో వచ్చింది.
దానిమీద సందేశం ఇలా ఉంది.. ‘‘వింగ్ కమాండర్ అభినందన్ గారు బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికారు, మోదీజీని మళ్లీ ప్రధాని చేయడానికి ఓటు కూడా వేశారు. ప్రస్తుతం మోదీ కంటే మెరుగైన ప్రధాని ఎవరూ లేరని ఆయన అంటున్నారు. ఇది జీహాదీలకు, కాంగ్రెస్ వాళ్లకు చేరేవరకు షేర్ చేయండి. మీరు ఎప్పుడూ ఒక జవానును సజీవంగా వెనక్కి తీసుకురాలేదు. ఇప్పుడు అభినందన్ వచ్చి, బీజేపీకి ఓటు వేశారు’’. ఈ పోస్టు ఫేస్ బుక్ లో వైరల్ గా మారి, బీజేపీకి మద్దతిచ్చే అనేక పేజీలు, గ్రూపులలో విపరీతంగా షేర్ అయింది.
రాజకీయాలకు ఐఏఎఫ్ దూరం
భారత వైమానిక దళంలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారన్నా అది పూర్తిగా తప్పే. అది ఎందుకంటే, 1969 నాటి వైమానిక దళ నిబంధనలలో వైమానికదళ సిబ్బంది ఎవరూ క్రియాశీల రాజకీయాల్లో పాలు పంచుకోకూడదని స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి వైమానిక దళ చట్టం మాన్యువల్ లో ఉంది. ఇది రక్షణ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంది.
అచ్చం ఆయన లాగే..
ఫేస్ బుక్ పోస్టులలో వచ్చిన వ్యక్తి రూపం గానీ, మీసకట్టు గానీ అన్నీ అచ్చం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లాగే ఉన్నాయి. కానీ పట్టిపట్టి చూస్తే కొన్ని తేడాలు కనిపిస్తాయి. కళ్లు, జుట్టు గుర్తుపట్టకుండా ఉండేందుకు గాగుల్స్, టోపీ పెట్టుకున్నారు. కానీ అప్పటికీ చిన్న చినన తేడాలు కనిపించాయి.
1) అభినందన్ పెదవుల కింద చిన్న పుట్టుమచ్చ ఉంటుంది గానీ, అది కాషాయ కండువా వ్యక్తికి లేదు.
2) కాషాయ కండువా వ్యక్తికి కుడికంటి కింద పుట్టుమచ్చ ఉంది గానీ, అది అభినందన్ ముఖమ్మీద లేదు.
3) అభినందన్ గెడ్డం కింద ఒక అడ్డగీత ఉంటుంది, అది కాషాయ కండువా వ్యక్తికి లేదు.
అంతేకాదు, కాషాయ కండువా వ్యక్తి భుజాలు కిందికి దిగిపోయినట్లుంటాయి గానీ, అభినందన్ కు అలా ఉండవు. ఇవన్నీ పక్కన పెడితే, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఓటు తమిళనాడులో ఉంది. కానీ అక్కడ ఇంతవరకు మొదటివిడత ఎన్నికలు కూడా జరగలేదు. ఈనెల 18వ తేదీన ఒకే విడతలో తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకుముందు బూమ్ లైవ్ కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తన పాఠకులకు వివరించింది.