అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం 10 గంటలకు విడుదల చేసే తుది జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేందుకు వారు ఎదురు చూస్తున్నారు. తద్వారా వారు భారతీయులా లేక విదేశీయులా అనేది స్పష్టత రానుంది. తుది జాబితాలో పేరు లేనివారిని ఇకపై విదేశీయులుగా పరిగణిస్తారు. ఒకవేళ వారు భారతీయులే అయితే.. విదేశీ ట్రిబ్యునళ్లను ఆశ్రయించి తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చు. విదేశీయులుగా గుర్తించినవారిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి.
మరోవైపు కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఎన్ఆర్సీ అంశం చేరనుంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ కు ఉన్న స్వయంప్రతిపత్తి ఆర్టికల్ 370ని దర్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అసోంలోని ఎన్ఆర్సీపై సంచలన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
బంగ్లాదేశ్ నుంచి పెద్దఎత్తున తరలివస్తున్న అక్రమ వలసదారులను గుర్తించాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్సీని ప్రవేశపెట్టారు. 1951లో మొదటి ఎన్ఆర్సీని విడదల చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక తిరిగి మళ్లీ అస్సాంలో ఎన్ఆర్సీ నమోదు ప్రక్రియను చేపట్టి 2018 జులై 18 న జాబితాను విడుదల చేశారు. అది తప్పులతడకగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మొదటి ఎన్ఆర్సీలో ఉన్నవారు, 1970కి ముందు నుంచీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి వంశస్థుల పేర్లు జాబితాలో రాలేదు. జూన్ 26న విడుదలైన ఎన్ఆర్సీ జాబితా ప్రకారం మొత్తం 3.29 కోట్ల దరఖాస్తులు రాగా 2.9 కోట్ల మందిని ఎన్ఆర్సీలో నమోదుచేశారు. మిగతా 41 లక్షల మందిని విదేశీయుల క్యాటగిరీలో చేర్చారు. జాబితాలో పేరులేనంత మాత్రాన విదేశీయులు కారని, అధైర్యపడొద్దని సీఎం సర్బనంద సోనోవాల్ చెప్తున్నారు. బాధితుల సహాయార్థం విదేశీ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశామన్నారు. బాధితులు సరైన ధ్రువపత్రాలను తీసుకొని ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తే వాటిని పరిశీలించి తీర్పునిస్తారు. అక్కడ న్యాయం దక్కకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్రంలో మొత్తం వెయ్యి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేశారు.