హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భైంసా ఘటనకు నిరసనగా మంగళవారం ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆదివారం(జనవరి 12) రాత్రి నిర్మల్ జిల్లా భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపుచేసే క్రమంలో పలువురు పోలీసు అధికారులకు కూడా గాయాలపాలయ్యారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయనుకున్న సమయంలో సోమవారం వదంతులు వ్యాపించడంతో మళ్లీ పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కోర్భాగల్లీ, జుల్ఫేకర్, కిసాన్ గల్లీల్లో ఇరు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో సోమవారం రాత్రి 8 నుంచి మంగళవారం ఉదయం 7 వరకు కర్ఫ్యూ విధించారు. పట్టణమంతా మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. పట్టణంలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసి మూడు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనకు సంబంధించి 25 మందిని అదుపులోకి తీసున్నట్లు పోలీసులు వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో పోలీసుల ఆదేశాలు ధిక్కరించి.. ఎవరు బయట తిరిగినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు.
భైంసాలో జరిగిన ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు జిల్లా నాయకులను ఉదయమే భైంసాకు చేరుకున్నారు. బాధిత ప్రాంతాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అనుమతించలేదు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎం ప్రణాళిక బద్ధంగా భైంసాలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ అల్లర్లకు నిరసనగా మంగళవారం నిర్మల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందన్న అభిప్రాయంతో ఎమ్మెల్యే రాజాసింగ్ ను గృహ నిర్బంధం చేశారు.