న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం చివరి రోజు విచారణ సందర్భంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం నుండే కోర్టు హాలులో నాటకీయ పరిణామాలు జరిగాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది న్యాయస్థానంలో చూపించిన పుస్తకంపై వివాదం నెలకొంది. ఆ పుస్తకాన్ని ముస్లిం సంస్థల తరపు న్యాయవాది చించివేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఇదే పరిస్థితి కొనసాగితే కోర్టు నుండి వెళ్లిపోతామని హెచ్చరించారు. ఒక దశలో న్యాయవాదులకు, ప్రధాన న్యాయమూర్తికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
కీలకమైన అయోధ్య భూ వివాదం కేసు విచారణలో ఈ రోజు సాయంత్రం అయిదు గంటల కల్లా వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. నేడు వాదనలు ముగిస్తే సుప్రీం కోర్టు చరిత్రలో సుదీర్ఘ కాలం విచారణ జరిగిన రెండవ కేసుగా ఇది రికార్డుల్లోకి ఎక్కనుంది. వరుసగా 39 రోజులుగా సుప్రీం కోర్టు ఉభయ పక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబర్ 18 నాటికి విచారణ పూర్తి చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఒక రోజు ముందే బుధవారం (16వ తేదీ) విచారణను పూర్తి చేయనున్నట్లు సూచన ప్రాయంగా తెలిపింది. జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ పొందుతున్న నవంబర్ 17 నాటికి ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. మరో వైపు అయోధ్య వివాదంపై వాదనలు ముగియనుండటంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.