అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది.
తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కడప జిల్లాలో బిజెపి జెండా దిమ్మె నిర్మాణాన్ని వైసిపి నాయకులు అడ్డుకున్నారంటూ కన్నా కాస్త తీవ్రంగానే విరుచుకుపడ్డారు. వైసిపి అరాచకాలను సహించేది లేదని హెచ్చరించారు. నిజానికి కన్నా అంత కటువైన భాష వాడాల్సినంత సందర్భం లేదు. ఆయన వాడిన భాష చూస్తుంటే రెండు పార్టీల మధ్య శతృత్వం ఉందనే అనుకోవాలి.
సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత ఢిల్లీ వెళ్లి తనను కలిసిన వైఎస్ జగన్ను ప్రధాని నరేంద్ర మోదీ చాలా సాదరంగా ఆహ్వానించారు. తనపై కత్తి కట్టిన చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్ది కాబట్టి జగన్ సహజంగానే మోదీకి మిత్రుడవుతారనేది సాధారణ అంచనా. చంద్రబాబును ఓడించడం కోసం మొన్నటి ఎన్నికలలో జగన్కు బిజెపి సహాయం చేసిందని కూడా అందరూ అనుకున్నారు.
అయితే ఈ స్నేహం ఎల్లకాలం ఉంటుందా? దక్షిణాదిన బలం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిజపి నాయకత్వం జగన్తో మంచి కోసం ఆంధ్రప్రదేశ్ను వదిలిపెడుతుందా? మోదీ, అమిత్ షా ద్వయం రాజకీయాలు గమనించినవారెవరైనా ఈ ప్రశ్నకు లేదనే సమాధానం ఇస్తారు. పై స్థాయిలో సన్నిహితంగా ఉంటున్నట్లు కనబడుతూనే రాష్ట్ర స్థాయిలో అధికారపక్షంపై సందు దొరికినప్పుడల్లా కాలు దువ్వడం అనే పాలసీని బిజెపి అమలు చేస్తుందని అనుకోవచ్చు. కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి ఎటూ లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిని దెబ్బ తీస్తే వైసిపికి తామే అసలు పోటీ కావచ్చని కమలనాధులు భావిస్తున్నారు.
అలా జరగాలంటే టిడిపి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీని బలహీనపరచడంతో పాటు వైసిపితో కయ్యం పెట్టుకోవడం కూడా సమాంతరంగా జరగాలని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు కనబడుతోంది. కన్నా లక్ష్మీనారాయణ విమర్శను ఈ కోణంలోనే చూడాలి. నిజానిక కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రజావేదికను కూల్చివేయగానే బిజెపి నుంచి కూడా విమర్శ వచ్చింది. ప్రభుత్వం చేసింది మంచిపని కాదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. హనీమూన్ ముగిసిపోయిందన్న మాట అప్పుడే వినబడింది. తాజాగా కన్నా విమర్శలు సంధించారు. బిజిపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కూడా వైసిపిపై విమర్శలు ఎక్కుపెట్టారు. క్రమేపీ బిజెపి విమర్శలు టిడిపినుంచి పక్కకు మళ్లి వైసిపి వైపు కేంద్రీకృతం అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు.