నాగర్ కర్నూల్: టీఆర్ఎస్కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన సత్తా ఏంటో చూపించారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి కాకుండా వేరే వాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూపల్లి… కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 స్థానాల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపారు. వారిలో 16 మంది విజయం సాధించారు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆయన మద్దతుదారుల సొంతమైంది. ఇక ఐజా మున్సిపాలిటీ పరిధిలోనూ జూపల్లి అనుచరుల హవా కొనసాగింది. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో తన మద్దతుదారులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపిన జూపల్లి… వారిలో పది మందిని గెలిపించుకోవడంతో విజయం సాధించారు.
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి.. టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక, వారికి బీఫామ్లు ఇచ్చే బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకే అప్పగించారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావు… తన వర్గం వారిని కొల్లాపూర్లోని మొత్తం 20 వార్డుల్లో పోటీ పెట్టారు. వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై పోటీకి నిలబెట్టారు. పట్టణంలో సింహం గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. జూపల్లి తీరుపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి… ఆయనపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. జూపల్లి తన వర్గీయులైన 20 మంది రెబెల్స్ తరపున ప్రచారం చేస్తున్న ఫోటోలు, వీడియోలను కేటీఆర్కు పంపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలోని ప్రజలను సింహం గుర్తుకు ఓటేయాలని, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా జూపల్లి ప్రచారం చేస్తున్నట్లు పార్టీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదులో ఆరోపించారు.
వాస్తవానికి గతంలోనే దీనిపై కేటీఆర్కు హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేయగా… రెబల్స్ను బరి నుంచి తప్పించాలని మంత్రి కేటీఆర్ జూపల్లిని కోరారు. అయితే నామినేషన్లు ఉపసంహరణ సమయానికి వారితో విత్ డ్రా చేయిస్తానని చెప్పిన జూపల్లి… వారంతా పోటీలో ఉండేలా చేయడం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్రంగా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన జూపల్లి.. 2014 ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు కొంచం దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకర్గంలో జూపల్లికి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి మధ్య ఆదిపత్య పోరు కూడా నడుస్తోంది. దీంతో తన వర్గీయులకు టికెట్లు ఇవ్వకపోడంతో వారందరినీ రెబల్స్ గా బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్కు తన బలమెంతో జూపల్లి చూపించారు.