న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేన నాయకత్వం పార్టీ శాసనసభ్యులను ముంబైలోనే ఓ స్టార్ హోటల్కు తరలించంగా, కాంగ్రెస్ పార్టీ తమ శాసససభ్యులను విహారయాత్రకు పంపింది. కాంగ్రెస్ తరపున గెలిచిన 44 మంది శాసనసభ్యులలో 40 మంది ప్రస్తుతం జైపూర్లో పర్యటిస్తున్నారు.
మల్లిఖార్జున్ ఖర్గే, అశోక్ చవాన్, అవినాష్ పాండే వంటి నాయకులు వారి వెంట ఉండి పరిస్థితిని కనిపెడుతున్నారు. అజ్మీర్, జోధ్పూర్ పర్యటన తర్వాత కాంగ్రెస్ శాసనసభ్యులు ఆదివారం జైపూర్ చేరారు. సోమవారం మధ్యాహ్నం వారు జైపూర్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి 105, దాని మిత్రపక్షమైన శివసేనకు 56 సీట్లు వచ్చాయి. రెండు పక్షాలకూ కలిపి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన దానికన్నా ఎక్కువే మెజారిటీ ఉంది. అయితే రెండున్నరేళ్ల కాలం తమకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలన్న శివసేన పట్టుకు బిజెపి అంగీకరించకపోవడంతో రెండు పార్టీల మధ్యా చెడింది. ఫలితంగా ప్రత్యామ్నాయాల అన్వేషణ జరుగుతోంది. శివసేనతో కలిసి పని చేసే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఎన్సిపి అంగీకరించడంతో కొత్త సమీకరణాలు రంగంలోకి వచ్చాయి.