అమరావతి: చంద్రబాబు, లోకేష్లకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వారి అవినీతి చూసి ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి తీసుకోని సంచలన నిర్ణయాలతో సిఎం జగన్మోహన్ రెడ్డి అందరి మన్ననలు పొందే విధంగా పరిపాలన చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పరి పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తూ చంద్రబాబు హయాంలో గాడి తప్పిన పాలనను సరిదిద్దుతున్నారని అన్నారు. జగన్ పాలన చూసి చంద్రబాబు, లోకేష్కు కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనపై టిడిపి వేసిన పుస్తకం అబద్ధల పుట్ట అనీ, దాన్ని లోకేష్ మడిసి సూట్ కేసులో పెట్టుకోవాలన్నారు. ప్రజలను, నమ్మిన వాళ్లను ముంచడంలో చంద్రబాబుది పేటెంట్ హక్కు అని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దయదక్షిణ్యం మీద టిడిపి బతికి ఉందని కన్నబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే టిడిపిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారన్నారు. చంద్రబాబు చేష్టలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు ఇచ్చిన ఒక హామీని నిలబెట్టుకోలేదనీ,జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను నెరవేరుస్తున్నారనీ కన్నబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆర్టిసిని విలీనం చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబు ఉందా అని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని, నందిని పంది, పందిని నంది అని చెప్పి నమ్మించగల సమర్థుడు ఆయన అని విమర్శించారు. ఔట్ డేటెడ్ లీడర్ చంద్రబాబు అయితే అప్ డేట్ కానీ లీడర్ లోకేష్ అని వ్యంగ్యంగా విమర్శించారు.
లక్ష 30 వేల ప్రభుత్వ ఉగ్యోగాలు ఒకే సారి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని కన్నబాబు అన్నారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా చంద్రబాబు చిన్న భిన్నం చేశారని విమర్శించారు.ఇంగ్లీష్ మీడియా ప్రవేశ పెడితే చంద్రబాబు పెట్టుబడిదారులకు ఇబ్బంది అవుతుందని బాధపడుతున్నారని అన్నారు. అవినీతి రహిత పరిపాలన జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం పెట్టారని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయలని చంద్రబాబు చూస్తే, జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారని కన్నబాబు అన్నారు.