అమరావతి నుండి రాజధాని తరలించడానికి వీలులేదంటూ ఆ ప్రాంత రైతాంగం.. సీఏం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కు ముందు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, సామూహిక ధర్నాలు చేశారు. లోక్ డౌన్ సమయంలోనూ భౌతిక దూరం పాటిస్తూ నిరసనలు నిర్వహించారు. వీరి ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో సహా బీజేపీ, జనసేన, ఇతర పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అయితే రాజధాని భూసేకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని, టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో ఎటువంటి శాశ్విత నిర్మాణాలు చేయలేదని వైకాపా నేతలు విమర్శిస్తూ వచ్చారు. అమరావతి లో జరుగుతున్నది టీడీపీ ప్రేరేపిత ఉద్యమం అని అధికార పార్టీ కొట్టి పారేస్తూ వచ్చింది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని అధికారపక్షం పేర్కొంటూ వస్తున్నది.
ఒక పక్క అమరావతి రైతులు రాజధాని అంశంపై హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేయడం, విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అసెంబ్లీలో సీఆర్డిఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించడం జరిగిపోయాయి. ఈ బిల్లులను శాసన మండలిలో తొలిసారి ఆమోదించ కుండా సెలక్ట్ కమిటీకి పంపడం, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడం తదితర నేపధ్యాలలో రెండవ సారీ ఈ బిల్లులను మండలికి పంపడం జరిగింది. మరో పక్క ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖను చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ వెళుతోంది. అయితే అకస్మాత్తుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజధానిపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.
కరోనా తగ్గిన తరువాతే
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున రాజధాని తరలింపుపై ఎలాంటి ఆలోచన చేయడం లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. జూలైలో కరోనా కేసులు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతాయంటున్నారని, కావున ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై మాట్లాడే పరిస్థితి లేదన్నారు.కరోనా తగ్గిన తరువాతే రాజధానిపై మాట్లాడతామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
రాజధాని తరలింపును అడ్డుకున్న కరోనా
రాజధాని తరలింపును కరోనా తాత్కాలికంగా అడ్డుకున్నది. సాంకేతిక అంశాల ద్వారా సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు పాసై పోయినట్లుగా భావించి త్వరలో రాజధాని తరలింపునకు ప్రభుత్వం పనులు ప్రారంభిస్తుందని అందరూ భావించారు.విశాఖలో కార్యాలయాలకు అవసరమైన స్థలాలు, భవనాలు…ఆర్కిటెక్చర్లను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో పక్క బడ్జెట్ లోనూ దాదాపు 600 కోట్ల రూపాయలను కొత్త రాజధానికి కేటాయించారు. రేపో మాపో రాజధాని విశాఖకు తరలి వెళుతుంది, ఎవరు అడ్డుకోలేరు అని అనుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా లాక్ డౌన్ లు విధించాల్సి వస్తోంది. పాజిటివ్ కేసులు ఊహించనంతగా పెరుగుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు విషయాన్ని కరోనాతో ముడిపెట్టి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడటంతో ఇప్పటికి ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గినట్లు ఉందంటున్నారు.