తెలంగాణా శాసనసభ ఎన్నికల ఫలితాల గురించి ఎదురుచూస్తున్నది ఒక్క తెలంగాణా రాష్ట్ర ప్రజలే కాదు. ఆంద్రప్రదేశ్లో కూడా ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిజానికి యావత్ భారతం రేపు రానున్న ఐదు రాష్ట్రాల ఫలితాల గురించి ఎదురు చూస్తున్నది. సార్వత్రిక ఎనికల ముందు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఎలాంటి మూడ్ ఉన్నదీ తెలియజేస్తాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎదురులేకుండా పోయిన మోదీ, షా ద్వయం ఎన్నికల వ్యూహాలకు చెక్ చెప్పడం సాధ్యమా కాదా అన్న విషయం తేలిపోతుంది కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రజలు సరే, తెలంగాణా ఎన్నికల ఫలితాలు సానుకూలంగా రావడం రాజకీయ నాయకుల్లో ఎవరికి ఎక్కువ ముఖ్యం? ముఖ్యమంత్రి కెసిఆర్కా, గెలిచే వరకూ గడ్డం తీయనని భీష్మించిన ఉత్తమ్కుమార్ రెడ్డికా, కెసిఆర్పై కాలుదువ్విన రేవంత్రెడ్డికా? లేక తండ్రి వారసత్వంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుందామని ఉవ్విళ్లూరుతున్న కెటిఆర్కా? వీరందరికీ ఫలితాలు సానుకూలంగా రావడం చాలా ముఖ్యమే. అందరూ తెలంగాణా అధికారపీఠంపై దృష్టి పెట్టిన వారే. అందరూ తెలంగాణాలో భాగమైన వారే. కానీ నిజానికి వీరెవరికీ లేనంత ఉత్కంఠ తెలంగాణాకు చెందని ఒక రాజకీయ నాయకుడికి ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు మొదట తెలంగాణా ఎన్నికలలో కీలక పాత్ర పోషించాలనుకోలేదు. టిఆర్ఎస్తో కలిసి పోటీ చేసి తెలంగాణాలో టిడిపి ఉనికి నిలబెట్టాలనుకున్నారు. కెసిఆర్ ఠాట్ పొమ్మనేసరికి కాంగ్రెస్తో చేతులు కలిపారు.జాతీయ స్థాయిలో తాను నడిపించాలనుకుంటున్న మోదీ వ్యతిరేక ఫ్రంట్ రాజకీయాలకు కూడా ఇది కలిసివచ్చింది. దానితో తెలంగాణా ఎన్నికల కథ రసకందాయంలో పడింది.
జాతీయ స్థాయలో మోదీ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్న చంద్రబాబుకు ఆ విధంగా తెలంగాణా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. ప్రజాఫ్రంట్ గెలిస్తే తెలంగాణా వ్యతిరేకి అన్న పేరును చంద్రబాబు పోగొట్టుకున్నట్లే. దానితో ఆయనకు కెసిఆర్పై నైతిక విజయం కూడా లభించినట్లవుతుంది. అన్నిటినీ మించి మోదీ వ్యతిరేక ఫ్రంట్ ప్రయత్నాలకు ఇంకా ఊపు వస్తుంది. 2019 ఎన్నికలలో మోదీ ప్రధాని కాకుండా నిలువరించడంపై చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టారు. అంతేకాకుండా సొంత రాష్ట్రంలో జగన్, పవన్ దూకుడుకు కాస్త కళ్లెం పడుతుంది. ఇన్ని రకాలుగా తెలంగాణా ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు చాలా ముఖ్యం.
కెసిఆర్ ఓడిపోతే ఫాంహౌస్కు వెళ్లి వ్యవసాయం చేసుకుంటారు. ఆ మాట ఆయన అననే అన్నారు. మళ్లీ ఎన్నికల వరకూ కొడుకో మేనల్లుడో పార్టీ నడిపిస్తారు. ప్రంట్ అదికారంలోకి రాలేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పడు చేస్తున్నట్లుగా గడ్డం ట్రిమ్ చేసుకుంటూ మళ్లీ ఎన్నికల వరకూ పార్టీ నాయకత్వం నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి వయసులో చిన్నవాడు కాబట్టి ఇంకా చాలాకాలం ఎదురు చూడగలడు. చంద్రబాబుకు మాత్రం అలా కాదు.