అమరావతి: అబ్దుల్లాపూర్మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు ఎవరైనా తాడు బయట నుండే ఇవ్వాలనీ, లోపలకి ఎవరినీ అనుమతించవద్దనీ సిబ్బందిని ఆదేశించారు. ఇక్కడి తహశీల్దార్ హడావుడి చూడి సిబ్బందితో పాటు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. రెవెన్యూ శాఖలోని సిబ్బంది వివిధ పనులు చేయడానికి అవినీతికి పాల్పడుతుంటారని ప్రజలు అనుకుంటుంటారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలో అబ్దుల్లాపూర్మెట్ ఘటనపై రెవెన్యూ అధికారులు నిరసన వ్యక్తం చేస్తుండగా పట్టాదారు పాసుపుస్తకం కోసం తీసుకున్న లంచం డబ్బులు ఇవ్వాలంటూ ఒక మహిళా రైతు విఆర్ఒను నిలదీసిన ఘటన రెవెన్యూశాఖలోని అధికారుల తీరును బహిర్గతం చేస్తున్నది. నిత్యం పనుల కోసం వివిధ వర్గాల ప్రజలు, రైతులు తహశీల్దార్ కార్యాలయాలకు రావడం, సమస్యలపై వినతి పత్రాలు ఇస్తుండటం జరుగుతుంటుంది. అబ్దుల్లాపూర్మెట్ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే కానీ ఈ ఘటన నేపథ్యంలో రెవెన్యూ వర్గాలు కూడా ఆత్మావలోకనం చేసుకొని ప్రజల ఇబ్బందుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.