న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిలుకోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. చిదంబరం సుమారు యాభై ఏళ్లుగా ప్రజా జీవనంలో ఉన్నారని, అలాంటి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. తనకు ఉన్న ఆస్తుల గురించి ఆయన ఏ విషయాన్నీ దాచలేదని, అటు మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించేలా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగినట్టు నిరూపితమైతేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప..నిరాధారమైన ఆరోపణలతో ఒక వ్యక్తిని దోషిగా ఎలా పరిగణిస్తారని వారు ప్రశ్నించారు.
Statement on behalf of our family. @ANI @the_hindu @timesofindia @IndianExpress @ndtv @IndiaToday @CNNnews18 @TimesNow @NewsX pic.twitter.com/tzwWc4h5lI
— Karti P Chidambaram (@KartiPC) August 27, 2019
మరోవైపు ఈడీ కేసులో చిదంబరం బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. డిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలోనే చిదంబరం దానిపై సుప్రిం కోర్టుకు వెళ్లారు. దీంతో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం సుప్రిం కోర్టును ఆశ్రయించడంతో నేడు విచారణకు చేపట్టింది. చిదంబరంను విచారిస్తున్న ఈడీ.. ఎలాంటి డాక్యుమెంట్లను కోర్టులో సమర్పించడం లేదని, కానీ కస్టడీకి మాత్రం అడుగుతోందని చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. విచారణ సందర్భంగా కేసుకు సంబంధం లేని, అనవసర ప్రశ్నలు వేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ కస్టడీకి కోరడం ఏంటని కపిల్ సిబల్ ప్రశ్నించారు. అయితే మధ్యహ్నం చేపట్టిన వాదనలను రేపటికి వాయిదా వేసింది. దీంతో బుధవారం కూడా మరోసారి ముందస్తు బెయిల్పై వాదనలు కొనసాగనున్నాయి.