హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని డిపోల్లో ఆదివారం తలపెట్టిన మానవహారాలు, మౌనదీక్షలు విజయవంతమయ్యాయని చెప్పారు. గత 51 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అన్ని డిపోలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతో నిరసనలు తెలపాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. తమ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని, ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సమ్మె కొనసాగుతోంది. సమ్మె ప్రారంభమై 50రోజులు దాటినా… ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. చివరికి తమంతట తామే విధుల్లోకి చేరతామని చెప్పినా… అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు.
ఇదిఇలా ఉంటే.. 5,100 ఆర్టీసీ ప్రైవేట్ రూట్ల పర్మిట్ల నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్టీసీ నిర్వహిస్తున్న రూట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ప్రైవేటు బస్సులకు ఆర్టీసీ రూట్ పర్మిట్ల జారీకి రంగం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ, రవాణా శాఖలు సంయుక్తంగా కొంత కసరత్తు చేశాయి. పలు దఫాలు వాటిపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు.