న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈ నెల ఆరవ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపి సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చినపుడు, ఇప్పటికే రెండు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకున్నామని కమిషన్ తెలిపింది.
ఏప్రిల్ ఒకటిన మహారాష్ట్రలోని వార్ధా వద్ద ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మతస్థులు మైనారిటీ అయిన ప్రాంతాలకు పారిపోతోందని వ్యాఖ్యానించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై ఆయన వ్యాఖ్యానం ఇది.
మొదటిసారిగా వోటు చేస్తున్న యువత బాలాకోట్ వైమానిక దాడుల హీరోలకు తమ వోటు అకింతం చేయాలని ఏప్రిల్ తొమ్మిదిన మహారాష్ట్రలోని లాతూర్లో మోదీ పిలుపునిచ్చారు. ఈ రెండు ప్రసంగాలూ ఉల్లంఘనల కిందకు రావని ఎన్నికల కమిషన్ మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. మోదీ, షా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కాంగ్రెస్ మొత్తం 11 ఫిర్యాదులు చేసింది.
మిగతా ఫిర్యాదులపై ఆరవ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రోజు కోర్టు మళ్లీ ఈ పిటిషన్ను విచారిస్తుంది. మోదీ, అమిత్ షా ద్వయం ఉల్లంఘనలపై కాంగ్రెస్ మొదటి ఫిర్యాదును ఏప్రిల్ అయిదున దాఖలు చేసింది. ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలతో కూడిన పూర్తి కమిషన్ ఏప్రిల్ అయిదు నుంచీ ఒక్కసారి కూడా ఈ ఫిర్యాదులపై పరిశీలనకు కూర్చోలేదని ఇండియన్ ఎక్స్ప్రెస్ రెండు రోజుల క్రితం వెల్లడించింది.