న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ దారి తీయకుండా చూసేందుకు కేంద్రప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. తీర్పు దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఒక కంట్రోల్ రూం నెలకొల్పింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం అక్టోబర్ 16వ తేదీన ఈ కేసులో తీర్పు వాయిదా వేసింది. ధర్మాసనంలోని మిగిలిన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్
డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్తో సంప్రదించిన తర్వాత శనివారం తీర్పు వెలువరించాలని ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం పొద్దుపోయిన తర్వాత నిర్ణయించారు. ఉదయం 10 30 గంటలకు తీర్పు ప్రకటిస్తారు. దశాబ్దాల తరబడి నాని దేశంలో తీవ్రమైన ఘర్షణలకు దారి తీసిన అయోధ్య వివాదం విషయంలో అనిచ్ఛితికి ఈ తీర్పు తెర దించుతుందని భావిస్తున్నారు.
ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీ, పోలీసు డైరక్టర్ జనరల్ ఓంప్రకాష్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులోని జస్టిస్ గొగోయ్ ఛాంబర్లో ఆయనను కలిశారు. దేశరాజకీయాలపై పెను ప్రభావం చూపనున్న ఈ తీర్పు దరిమిలా ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రధాన న్యాయమూర్తి ఆ అధికారులతో సమీక్షించారు.
తీర్పు గురించి అనవసరమైన ప్రకటనలు వద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు మొన్న సూచించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ గురువారం రాత్రి లక్నోలో ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని మూడు గంటల పాటు సమీక్షించారు. అవసరమైతే వాడేందుకు లక్నోలో ఒక హెలీకాప్టర్నూ, అయోధ్యలో మరో హెలీకాప్టర్నూ సిద్ధంగా ఉంచాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.