(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలోని బెలూంగుహాల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు.. సుబ్బారావును వేటకొడవళ్లతో నరికి చంపి.. అనంతరం బండరాయితో తలపై మోది పరారయ్యారు. దీంతో సుబ్బారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. బెలూంగుహల సమీపంలో పనులు జరుగుతుండగా అక్కడికి సుబ్బారావు వెళ్లారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో కాపుకాసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి చంపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమా ? లేక రాజకీయ కక్షలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సుబ్బారావు బనగానిపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. ఎన్నికల సమయంలో కూడా కీలకంగా వ్యవహరించారు.
కొంతకాలంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సుబ్బారావుకు గనుల విషయంలో మరో వర్గంతో గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా లావాదేవీల విషయంలో సుబ్బారావుకు మరో వర్గంతో విభేదాలు మొదలయ్యాయాని సమాచారం. ఈ నేపథ్యంలో వాళ్లే సుబ్బారావును హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కర్నూలులో కలకలం రేపిన వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్య మరువక ముందే..తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. ఇన్నిరోజులుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమనడంతో సంచలనంగా మారింది.